News

హరీశ్‌రావు ఆకస్మికంగా రైతుబజారును సందర్శించారు


హైదరాబాద్‌లో పెద్ద రైతుబజార్‌ మెహదీపట్నంలో ఉంది. శంషాబాద్‌ పరిసర గ్రామాల నుంచి రైతులు నిత్యం పెద్ద ఎత్తున కూరగాయలను ఈ రైతు బజారుకు తరలించి సరసమైన ధరకు అమ్ముకుంటుంటారు. బోర్డ్‌ మీద ఉన్న ధరను దాటి అక్కడున్న రైతులు అమ్ముతున్నారని కొనుగోలుదారులు వీరికి ఫిర్యాదు చేస్తే ఆ రైతులను ఉద్యోగులు సరైన రేటుకు అమ్మేలా చర్యలు తీసుకుంటారు. కాయగూరల అమ్మకందారులు ప్రతిదినం రైతుబజారు ముగిసే సమయం అంటే సుమారు రాత్రి 8.30-9.00 గంటల వరకు ఉంటారు. తర్వాత అక్కడ ఉద్యోగులు అమ్మకందారులకు మూసేస్తున్నామని చెప్పి వారు బయటకు వెళ్లేవరకు ఆగి రైతుబజారు ఇన్‌-ఔట్‌ గేట్లను బంద్‌ చేసి వెళ్లాలి. కానీ అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు రైతు బజారులో రైతులు ఇంకా అమ్మకాలు సాగిస్తుండగానే శుక్రవారం సాయంత్రం 8.30 గంటల లోపునే ఆఫీసుకు తాళాలు వేసి వెళ్లిపోయారు. సుమారు 8.35 గంటలకు భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఏమాత్రం ముందు సమాచారం లేకుండా ఆకస్మికంగా రైతుబజారును సందర్శించారు. అప్పటికే అక్కడ ఉద్యోగులు ఆఫీసు తాళాలు వేసి ఇళ్లకు వెళ్లిపోవడాన్ని గమనించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుబజార్‌ను ఆకస్మికంగా తనిఖీ చేయటం ఇదే మొదటిసారని రైతులు అనుకుంటున్నారు. తర్వాత ఆయన వెంటనే అక్కడ నుండి వెళ్లిపోయారు. రైతుబజార్‌ ఉద్యోగస్తుల బాధ్యతారాహిత్యం దీన్నిబట్టి తెలియజేస్తోంది.