News

మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై విపక్షాల బంద్‌


తెలంగాణలో మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేర బంద్‌కు కాంగ్రెస్‌, టీడీపీ, వైసీపీలు మద్ధతు పలికాయి.ఎంజీబీఎస్‌ ఎదుట వామపక్షాల కార్యకర్తలు ధర్నా చేశారు. ఆర్టీసీ బస్సులను అడ్డుకొని నిరసన తెలపడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వచ్చి వామపక్షాల కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, కే సీఆర్‌ నియంతృత్వ ధోరణి విడనాడాలని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికుల పట్ల కేసీఆర్‌ పాశవికంగా ప్రవర్తిస్తున్నారని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. నాగర్‌కర్నూలు, వనపర్తి, కల్వకుర్తి బస్‌డిపోల ఎదుట వామపక్షాల కార్యకర్తలు ధర్నా చేశారు. ఖమ్మం, కరీంనగర్‌ ఆర్టీసీ డిపోల వద్ద కార్యకర్తలు ధర్నా చేశారు. సిద్ధిపేట, సంగారెడ్డి, గజ్వేల్‌ డిపోల ఎదుట కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కోదాడలో మున్సిపల్‌ కార్మికులు డిపో ఎదుట బైఠాయించారు. హన్మకొండ, నల్గొండ డిపోల ఎదుట కార్మికులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.