News

రేవంత్‌ సస్పెన్షన్‌ ఖాయం


‘ఓటుకు నోటు కేసు’లో అరెస్టయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు ఖాయమని అధికార టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరిగితే అప్పుడు ఈ దిశగా చర్యలు తప్పవని అధికార టీఆర్‌ఎస్‌ ముఖ్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులో రేవంత్‌ రెడ్డి బెయిల్‌పై విడుదలైనప్పటికీ, ఆయనను అసెంబ్లీలో అడుగు పెట్టనిచ్చేదిలేదని అంతర్గత సంభాషణల్లో గట్టిగా చెబుతున్నారు. రేవంత్‌ రెడ్డిని టీఆర్‌ఎస్‌ పార్టీ తొలి నుంచీ బలమైన రాజకీయ శత్రువుగా పరిగణిస్తోంది. ఇది బహిరంగ రహస్యమే. ముడుపుల కేసులో రేవంత్‌ పాత్ర బయటపడినప్పటి నుంచి... ‘ఇక ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టలేరు’ అనే అభిప్రాయం టీఆర్‌ఎస్‌లో వినిపిస్తోంది. అయితే, కోర్టులో కేసు నడుస్తుండగా ఆయనపై అసెంబ్లీలో చర్యలు తీసుకునే వీలుందా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అసెంబ్లీలో చర్యలు తీసుకోవడానికి, కోర్టు కేసుకు అసలు సంబంధమే ఉండదని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు పలువురు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది