News

కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..


ఈ ఏడాది చివర్లో కీలకమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల జరుగనున్న వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తప్పేలా లేదు. కొద్దికాలంగా కాంగ్రెస్ అధిష్ఠానం పట్ల అసంతృప్తితో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత శంకర్‌సింగ్ వాఘేలా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పనున్నారు. తిరిగి ఆయన బీజేపీ గూటికి చేరనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు ముహూర్తం కూడా ఖరారైనట్టు చెబుతున్నారు. ఈనెల 21న ఆయన కాంగ్రెస్‌కు ఉద్వాసన చెప్పి బీజేపీ తీర్ధం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. కొద్దికాలంగా వాఘేలా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెబుతారంటూ వార్తలు వినిపిస్తున్నా అది కార్యరూపంలోకి రాలేదు. గుజరాత్‌లో ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ ఎలాగైనా వాఘేలాను తిరిగి సొంత గూటికి రప్పించేలా ఒప్పించేందుకు ప్రయత్నాలు సాగిస్తూ వచ్చింది. పలు దఫాలు మంతనాలు కూడా సాగించింది. తిరిగి సీఎం పగ్గాలు పట్టాలని వాఘేలా కోరుకుంటున్నారని, బీజేపీ సీఎం అభ్యర్థిగా తన పేరును పరిగణనలోకి తీసుకోవాలని ఆ పార్టీ పెద్దలకు సూచించారని, ఎట్టకేలకు పలు దఫాల చర్చలు ముగిశాయని చెబుతున్నారు. గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీని అధిష్ఠానం నిర్లక్ష్యం చేస్తోందని, కాంగ్రెస్‌లో తిరిగి జవసత్వాలు నింపాల్సిన తరుణంలో అచేతనంగా వ్యవహరించడం సరికాదని వాఘేలా కొద్దికాలంగా వాదిస్తున్నారు. తన వాదనను వినిపించేందుకు గత నెలలో కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కలుసుకోవాలని ఆయన ప్రయత్నించినా అధిష్ఠానం ఆయనకు సమయం కేటాయించ లేదని చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకుంటూనే తన రాజకీయ భవిష్యత్తుకు మంచిదన్న నిశ్చితాభిప్రాయానికి వాఘేలా వచ్చారని అంటున్నారు. గతంలో గుజరాత్ సీఎంగా పనిచేసిన వాఘేలా నాలుగుసార్లు ఎంపీగా కూడా ఉన్నారు.