News

హైకోర్టులో జేసీ దివాకర్‌ రెడ్డికి షాక్‌


హైకోర్టులో అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డికి చుక్కెదురు అయింది. విమానయాన సంస్థలు తనపై నిషేధం విధించడాన్ని సవాల్‌ చేస్తూ ఆయన వేసిన పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘దివాకర్‌ ట్రావెల్స్‌లో ఇలాంటి సంఘటనలు జరిగితే అమనమతిస్తారా?’ అని ప్రశ్నించింది. పార్లమెంట్‌ జరుగుతున్నందున తాత్కాలికంగా అయినా అనుమతించాలని జేసీ తరఫు న్యాయవాది హైకోర్టును అభ్యర్థించారు. అయితే విమానయాన సంస్థల వాదనలు వినకుండా ఆర్డర్‌ ఇవ్వడం కుదరదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. కాగా తనపై దేశీయ విమానయాన సంస్థలు నిషేదం విధించడం న్యాయసూత్రాలకు విరుద్ధమని జేసీ దివాకర్‌రెడ్డి  హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దేశీయ విమానాల్లో రాకపోకలు సాగించేందుకు తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసేలా వాటిని ఆదేశించాలని కోరారు. జూన్‌ 15న విశాఖపట్నం విమానాశ్రయంలో ఆలస్యంగా ఎయిర్‌పోర్టుకు చేరుకోవడంతో బోర్డింగ్‌ పాస్‌ను నిరాకరించిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సిబ్బందితో జేసీ గొడవపడిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై దేశీయ విమానయాన సంస్థలలో నిషేధం కొనసాగుతుండటంతో రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు జేసీ దివాకర్‌ రెడ్డి...తన స్నేహితుడి ప్రయివేట్‌ విమానంలో ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది.