News

రైల్వేస్టేషన్‌లో బాంబు కలకలం


మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని చర్చిగేట్‌ రైల్వేస్టేషన్‌లో బాంబు పెట్టినట్లు ఈ ఉదయం గుర్తుతెలియని వ్యక్తుల నుంచి రైల్వే భద్రతాసిబ్బందికి ఫోన్‌ కాల్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. క్రైం బ్రాంచ్‌, ఉగ్రవాద వ్యతిరేక స్క్వాడ్‌కు సమాచారమిచ్చారు. ఉదయం నుంచి స్టేషన్‌ అంతా ముమ్మరంగా గాలించారు. జాగిలాల సాయంతో విస్త్రత తనిఖీలు చేపట్టారు. పోలీసుల సోదాలతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అదే సమయంలో లోకల్‌ రైలులో అనుమానాస్పద బ్యాగును గుర్తించారు. దీంతో బ్యాగ్‌ను పరిశీలించగా.. అందులో అనుమానాస్పదంగా ఏమీ కన్పించలేదు. దీంతో ఆ ఫోన్‌ కాల్‌ బెదిరింపుకాల్‌ అయి ఉంటుందని పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫోన్‌ చేసింది ఎవరో తెలుసుకుంటున్నట్లు చెప్పారు.


కాగా.. ముంబయిలోని జావేరీ బజార్‌, ఒపేరా హౌస్‌, దాదర్‌ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరిగి సరిగ్గా నేటికి ఆరేళ్లు. 2011 జులై 13న సాయంత్రం 6.54 గంటల నుంచి 7.06 గంటల మధ్య ఈ మూడు ప్రాంతాల్లో వరుస పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోగా.. వంద మందికి పైగా గాయపడ్డారు.