News

కేటీఆర్‌పై సోషల్‌ మీడియాలో జోకులు


బీజేపీ శాసనసభా పక్ష నేత కిషన్‌ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై మండి పడ్డారు. హైదరాబాద్ నగరాన్ని అమెరికా, యూరప్‌, ఇస్తాంబుల్‌ చేస్తామని మాటలు చెప్పిన మంత్రులు, ముఖ్యమంత్రి ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రయాణించే రోడ్డే అధ్వాన్నంగా మారింది. అయినా పట్టించుకునే నాధుడే లేడని విమర్శించారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చెప్పి ఓట్లు వేయించుకున్నారని, మూడేళ్ల పాలనలో కనీసం రోడ్లు కూడా వేయలేకపోయారని కిషన్‌ రెడ్డి మండి పడ్డారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ గాలిలో మేడల కడుతున్నారని ఎద్దేవా చేశారు. మున్సిపల్‌ మంత్రి విదేశి పర్యటనలు చేస్తూ హైదరాబాద్‌ కూడా అలాగే ఉందనే అపోహలో ఉన్నారని, కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్దంగా ఉందని విమర్శించారు. ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీ తనం లోపించిందని మండిపడ్డారు. వారానికోసారి కూడా మంచి నీళ్లు రావడం లేదని, మెట్రో‍రైలు పని పడకేసిందన్నారు. పండుగలకు కూడా సరైన సౌకర్యాలు కల్పించడం లేదని దుయ్యబట్టారు. ఇదేనా మీరన్న విశ్వనగరం అంటూ.. మున్సిపల్‌ మంత్రిపై సోషల్‌ మీడియాలో జోక్స్‌ వేసుకుంటున్నారని కిషన్ రెడ్డి అన్నారు.