News

డీజిల్‌.. డోర్‌ డెలివరీ


బెంగళూరుకు చెందిన ఓ సంస్థ డీజిల్‌ను డోర్‌ డెలివరీ చేస్తోంది. వాహనదారులకు అవసరమైన ఇంధనాన్ని వాళ్లింటికే వెళ్లి అందిస్తోంది.న్యూస్‌పేపర్‌, పాలు మాదిరిగా ఇంటికే డీజిల్‌ను సరఫరా చేయాలనే వినూత్న ఆలోచనను ‘మై పెట్రోల్‌ పంప్‌’ సంస్థ ఆచరణలో పెట్టింది. ఐఐటీ ధన్‌బాద్‌ పూర్వవిద్యార్థి అశిష్‌కుమార్‌ గుప్తా ‘మై పెట్రోల్‌ పంప్‌’ పేరుతో ఏడాది క్రితం స్టార్టప్‌ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల్లో ఆయా వాహనదారుల ఇళ్లకు డీజిల్‌ను సరఫరా చేస్తారు. ఈ విధంగా డీజిల్‌ను డోర్‌ డెలివరీ చేయడం దేశంలోనే తొలిసారి. జూన్‌ 15న కొత్తగా మూడు డెలివరీ వాహనాలను ఆ సంస్థ ప్రారంభించింది. ఒక్కో వాహనం ద్వారా 950 లీటర్ల డీజిల్‌ను సరఫరా చేసే సదుపాయం ఉంది. ఇప్పటి వరకు 5వేల లీటర్ల డీజిల్‌ను డోర్‌డెలివరీ ద్వారా వాహనదారులకు సరఫరా చేశారు. ఆయా రోజుల్లో అమల్లో ఉన్న ధరలకే డీజిల్‌ను అందిస్తున్నారు. అయితే నిర్దేశిత డెలివరీ ఛార్జీని మాత్రం వాహనదారుల నుంచి వసూలు చేస్తారు. 100లీటర్ల వరకు రూ.99, ఆపైన ఒక్కో లీటర్‌కు రూపాయి చొప్పున ఆ సంస్థ డెలివరీ ఛార్జీగా వసూలు చేస్తోంది. ఈ విధంగా డోర్‌డెలివరీ ద్వారా డీజిల్‌ కావాలనుకునేవారు ఆన్‌లైన్‌, ఫోన్‌, ఆ సంస్థ యాప్‌ ద్వారా ఆర్డర్‌ చేయవచ్చు. ప్రస్తుతానికి ఆ సంస్థ బెంగళూరులోనే సేవలందిస్తోంది. త్వరలో మరిన్ని నగరాలను దీన్ని విస్తరించే అవకాశముంది. పెట్రోల్‌, డీజిల్‌ డోర్‌ డెలివరీ సాధ్యమే అని ఇటీవల పెట్రోలియం శాఖ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు ఆ శాఖ సన్నాహాలు చేస్తోంది.