News

కేటీఆర్‌కు హరీష్‌రావు అభినందనలు తెలిపారు


సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో మెడికల్ డివైజెస్ పార్క్ ఏర్పాటుకు మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో హరీష్‌రావు మాట్లాడుతూ.. మెడికల్ డివైజెస్ పార్క్ ఏర్పాటు కోసం కృషి చేసిన మంత్రి కేటీఆర్‌కు అభినందనలు తెలిపారు. మంత్రి కేటీఆర్ తెలంగాణను ఇండస్ట్రీయల్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నారు. ప్రభుత్వ పారిశ్రామిక విధానాల వల్ల పరిశ్రమల స్థాపనకు ఎందరో ముందుకు వస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శ్రమ వల్ల కొత్త పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. మెడికల్ డివైజెస్ పార్క్ ఏర్పాటుతో వేలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అంతే కాకుండా వైద్యం కూడా తక్కువ ధరలో అందుతుందన్నారు. స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పారిశ్రామికవేత్తలను కోరారు. గత ప్రభుత్వాల హయాంలో కరెంట్ లే చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. ఇప్పుడు ఆ సమస్య తొలగిపోయిందన్నారు. పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని చెప్పారు. ఉద్యమంలో ప్రదర్శించిన స్ఫూర్తినే రాష్ర్టాభివృద్ధి కోసం కూడా కొనసాగిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.