News

ఎయిర్‌పోర్టులో జేసీ వీరంగం


విశాఖ ఎయిర్‌పోర్టులో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి గురువారం ఉదయం వీరంగం సృష్టించారు. బోర్డింగ్‌ పాస్‌ ఇవ్వలేదన్న కోపంతో దౌర్జన్యానికి దిగారు. ఇండిగో విమానంలో హైదరాబాద్‌ వెళ్లేందుకు ఈ ఉదయం ఆయన విమానాశ్రయానికి వచ్చారు. బోర్డింగ్‌ పాస్‌ జారీ సమయం ముగియడంతో సిబ్బంది కౌంటర్‌ను ముసేశారు. తనకు బోర్డింగ్‌ పాస్‌ ఇవ్వాలని సిబ్బందితో ఆయన వాదనకు దిగారు. సమయం ముగిసిందని ఇవ్వడం కుదరదని చెప్పడంతో దివాకర్‌రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. బోర్డింగ్‌ పాస్‌ ప్రింటర్‌ను విసిరేసి వీరంగం సృష్టించారు. జేసీ చర్యతో అక్కడున్నవారంతా భయాందోళనకు గురయ్యారు. ఆయనపై ఉన్నతాధికారులకు ఎయిర్‌పోర్టు సిబ్బంది ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రితం తమ మేనేజర్‌పై దాడి చేసిన శివసేన రవీంద్ర గైక్వాడ్‌ను విమానాల్లో ప్రయాణించకుండా ఎయిరిండియా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ప్రైవేటు విమాన సంస్థలు కూడా ఆయనపై నిషేధం అమలు చేశాయి. దిగివచ్చిన గైక్వాడ్‌ పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో ఆయనపై నిషేధం తొలగించారు.