News

కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ


ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు అంశంపై ఇతర విపక్షాల మద్దతు కూడగట్టాలని యత్నించిన కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విపక్షాలన్నింటినీ కలుపుకొని మంగళవారం ఉమ్మడి విలేకరుల సమావేశం నిర్వహంచి, ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడాలన్న వ్యూహం బెడిసికొట్టింది. ఇందుకు విపక్ష పార్టీల నుంచి విముఖత వ్యక్తమైంది. సీపీఎం, జేడీయూ, ఎన్సీపీలు అందుకు ససేమిరా అన్నాయి. దీంతో విపక్షాలతో కలిసి తమ వాణిని వినిపించాలన్న కాంగ్రెస్‌ ప్రయత్నం దెబ్బతింది. ఉమ్మడి విలేకరుల సమావేశంపై సీపీఎం నేత సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. తాము వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించ దలుచుకోలేదన్నారు. అయినా ఇలాంటి విషయాల్లో పార్లమెంట్‌లో ఒక్కతాటిపై నిలిచినంత సులభంగా బయట వేదికపై ఏకం కావడం కుదరదని, ఇలాంటి విషయాల్లో విపక్షాలన్నీ ఏకమవ్వాలంటే ముందస్తు సంప్రదింపులు జరగాలని అన్నారు. తాము ఈ సమావేశానికి వచ్చేది లేనిది ఇంకా నిర్ణయించుకోలేదని జేడీయూ నేత కేసీ త్యాగి తెలిపారు. కాగా పెద్దనోట్ల రద్దు అంశంపై అన్ని పార్టీలకు ఒకే విధమైన అభిప్రాయం లేదని ఆయన అన్నారు. శరద్‌పవార్‌కు చెందిన ఎన్సీపీ కూడా తాము ఈ సమావేశానికి హాజరుకాలేమని తేల్చిచెప్పింది. మరోవైపు ముందు నుంచి పెద్దనోట్ల రద్దును వ్యతిరేకిస్తూ వస్తున్న తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం ఈ మేరకు సోమవారం దిల్లీ చేరుకోనున్నారు.