News

కాంగ్రెస్‌ పార్టీని కడిగి పారేస్తాం


అసెంబ్లీ సమావేశాల సాక్షిగా కాంగ్రెస్‌ పార్టీని కడిగి పారేస్తామని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. శవ రాజకీయాలు చేస్తున్న ఆ పార్టీ నాయకుల ఆగడాలను అరికడతామని, తమ వద్ద పూర్తి ఆధారాలున్నాయని, వారి బాగోతాలను బయటపెడతామని హెచ్చరించారు.మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మిస్తే తెలంగాణలో ఉనికిని కోల్పోతామనే భయంతోనే ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. ఆరేళ్ల క్రితం మృతి చెందిన వ్యక్తుల సంతకాలను పోర్జరీ చేసి వారి పేర్లపై కోర్టుల్లో దావాలు వేశారని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్‌మండలంలోని ఎం.బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు కాల్వలు, సిలారపు రాజనర్సింహ్మ ఎత్తిపోతల పథకాన్ని ఆయన గురువారం ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. పదేళ్లు అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్‌ తెలంగాణలో ఒక్క ప్రాజెక్టును నిర్మించలేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు చేతకాక వదిలేసిన కాల్వలు, ప్రాజెక్టు పనులను టీఆర్‌ఎస్‌ అధికారం చేపట్టాక రెండేళ్లలో పూర్తి చేసి సేద్యానికి జలాలు అందిస్తున్నదని స్పష్టం చేశారు. వారు అధికారంలో ఉన్నంతకాలం గుంట భూమి కూడా తడపలేదని, ఇప్పుడు ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతుంటే కాంగ్రెస్‌ నాయకులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. పదేళ్లపాటు కుంభకర్ణ నిద్రలో ఉన్న కాంగ్రెస్‌ నాయకులు కళ్లున్న కబోదుల్లా మారారని ఆయన దుయ్యబట్టారు.